ఈ 25 నుంచి 27 వరకు మూడురోజుల జాతర
హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తులు భారీగా రానున్నందున వేసవిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, కార్పెట్లతో పాటు టెంపుల్కు లైటింగ్, ప్రత్యేక పార్కింగ్, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.

ప్రధాన ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసు
వేములవాడలో ఈనెల 25,26,27 తేదీల్లో జాతర నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. జాతర సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు గుడి చెరువు వద్దగల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సొంత వాహనాలలో వచ్చే వారు తిప్పాపూర్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని..అక్కడి నుంచి ప్రధాన ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసులను నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
కాగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ దేవస్థానం అర్చకులు, అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలోనే సీఎంకు మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి జాతర వేడుకలు ఈ నెల 25 నుంచి 27 వరకు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.