మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు నంద్యాల జిల్లా యంత్రాంగం తీపి కబురు అందించింది. బ్రహ్మోత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తుల ప్రయాణం సాఫీగా సాగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు కీలక ప్రకటన చేశారు. నేటి నుండి ఈ నెల 16వ తేదీ వరకు శ్రీశైలం ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనాలకు టోల్ ఫీజును పూర్తిగా మినహాయిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా అటవీ ప్రాంతం కావడంతో రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై ఉండే ఆంక్షలను భక్తుల రద్దీ దృష్ట్యా సడలించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు వరకు 24 గంటల పాటు వాహనాలు రాకపోకలు సాగించేందుకు అనుమతినిచ్చారు. దీనివల్ల చెక్ పోస్టుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.
AP : మా ప్రాజెక్టుల్ని ఏపీ ఎందుకు అడ్డుకుంటోంది ? – సీఎం రేవంత్
శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుండి శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఇప్పటివరకు సుమారు 2.59 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ రద్దీని తట్టుకునేందుకు వీలుగా వివిధ ప్రాంతాల నుండి సుమారు 3,000 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది.

దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బంది కలగకుండా మంచినీరు, పాలు, మరియు అల్పాహారం నిరంతరం అందజేస్తున్నారు. పాతాళగంగ వద్ద స్నానాలు చేసే భక్తుల రక్షణ కోసం గజ ఈతగాళ్లను, ఘాట్ రోడ్డు పొడవునా మొబైల్ మెడికల్ టీమ్స్ను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే వాహనాల భద్రత కోసం ఘాట్ రోడ్డులో అదనపు లైటింగ్ మరియు పోలీస్ పెట్రోలింగ్ను ఏర్పాటు చేశారు. భక్తులందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తును కూడా జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com