తెలంగాణ రాష్ట్రంలోని పోడు రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా పట్టాలు పొందిన రైతులకు సాగు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సోలార్ పవర్ ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు కరెంటు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
పోడు రైతులు తమ భూముల్లో సాగు నిరవధికంగా చేసుకోవడానికి సోలార్ పవర్ ఏర్పాట్లు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి పంపు సెట్కు అవసరమైన సోలార్ యూనిట్ను సమకూర్చేందుకు త్వరలో గిరిజన సంక్షేమ శాఖకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు భట్టి వెల్లడించారు.
దీనివల్ల పోడు రైతులు కరెంటు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాగులో నష్టం లేకుండా, తమ భూములను సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుంది. గిరిజన సంక్షేమానికి సోలార్ విద్యుత్ ఏర్పాటు ఒక ప్రధాన బలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పోడు రైతులకు సోలార్ పంపుల ఏర్పాట్ల కోసం అవసరమైన నిధులను సేకరించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో గిరిజన సంక్షేమ శాఖను దీనిపై చర్యలు చేపట్టాలని ఆదేశించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో పోడు భూముల సమస్యకు ఒక నిర్ణయాత్మక పరిష్కారం లభిస్తుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. పోడు భూములపై సాగు చేయడానికి భరోసా కలిగినట్లు రైతులు తెలిపారు.