ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవల్లో సోమవారం అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ యూజర్లు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే మూడుసార్లు సేవలు నిలిచిపోయాయి. అమెరికా, ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఎక్స్ సేవలకు అంతరాయం కలిగినట్లు 40,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తాజాగా ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ఎక్స్ సేవల్లో అంతరాయానికి కారణం సైబర్ దాడేనని స్పష్టం చేశారు.
భారీ స్థాయిలో సైబర్ దాడి
భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగిందని, దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. సైబర్ దాడికి పాల్పడిన దుండగుల ఐపీ అడ్రస్ లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని తెలిపారు. ఈ విషయంపై ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ఎక్స్ పై సైబర్ దాడి జరిగింది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చు. ప్రస్తుతానికి దీనిపై కచ్చితంగా చెప్పలేను కానీ ఐపీ అడ్రస్ లు మాత్రం ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని గుర్తించాం’ అని మస్క్ చెప్పారు.

మస్క్ ఎక్స్ భద్రతపై ఏమంటున్నారు?
మస్క్ ఇప్పటికే ఎక్స్ భద్రతను మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. ‘‘సైబర్ దాడులను ఎదుర్కోవడానికి మా సాంకేతిక బృందం ప్రత్యేకంగా పనిచేస్తోంది’’ అని మస్క్ తెలిపారు. భవిష్యత్తులో అత్యాధునిక సెక్యూరిటీ అప్డేట్స్ తీసుకురానున్నట్లు తెలిపారు.
మూడుసార్లు డౌన్ అయిన ఎక్స్..
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తొలుత ఎక్స్ డౌన్ అయిందని, ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు ఈ సమస్య ఎదురైందని ‘డౌన్ డిటెక్టర్’ వెల్లడించింది. తర్వాత రాత్రి 7.30 గంటలకు, ఆపై రాత్రి 9 గంటలకు మళ్లీ సేవల్లో అంతరాయం నెలకొందని పేర్కొంది. ఎక్స్ యాప్ వాడుతున్న యూజర్లలో 56 శాతం మంది, వెబ్సైట్ వాడుతున్న వారిలో 33 శాతం మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారని తెలిపింది. ఎక్స్ సేవల్లో అంతరాయం కలిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సైబర్ దాడుల కారణంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మస్క్ ఆరోపణలు నిజమా? లేక సైబర్ దాడులకు మరెవరైనా కారణమా? అనేది త్వరలో స్పష్టత రావాల్సి ఉంది.