హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దంపతుల మధ్య తలెత్తిన గొడవను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఒక యువతిని భార్యగా భావించి వ్యక్తి కత్తితో పొడిచాడు. దాంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతోంది.

వివరాలు
మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సలీమ్ (60), రేష్మ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతుండగా, మరొక కూతురు హైదరాబాద్ మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్జీవోస్ కాలనీలో నివాసముంటోంది. బక్రీద్ పండుగ సందర్భంగా సలీం దంపతులు హైదరాబాద్లోని తమ కూతురి ఇంటికి వచ్చారు.
సలీం (Saleem) మద్యం సేవించి వచ్చి భార్య రేష్మతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రేష్మను చంపేస్తానంటూ కూరగాయలు కోసే కత్తితో బెదిరించాడు. దీంతో ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. వారి గొడవను ఆపేందుకు పక్కింట్లో ఉంటున్న జుబేదా (26) అక్కడికి చేరుకుంది. అయితే జుబేదా వచ్చిన విషయాన్ని గమనించని సలీమ్, ఆమెను తన భార్య రేష్మగా భావించి కత్తితో పొడిచాడు.
దీంతో జుబేదా (Zubeida) తీవ్రంగా గాయపడి కుప్పకూలింది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం అందించారు. మైలార్దేవ్పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన జుబేదాను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల స్పందన:
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయపడిన జుబేదాను ఆసుపత్రికి తరలించారు. సలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకస్మికంగా దాడి చేసినందుకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read also: Maganti Gopinath: నేడు మధ్యాహ్నం మాగంటి అంత్యక్రియలు..ప్రముఖుల సంతాపం