ఉత్తరప్రదేశ్లోని ఔరియా జిల్లాలో పెళ్లయిన రెండు వారాలకే భర్తను హత్య చేసేందుకు భార్య తన ప్రియుడితో కలిసి పన్నిన కుట్ర స్థానికంగా సంచలనం రేపింది.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిందితులు ప్రగతి యాదవ్(22), అనురాగ్ యాదవ్ ఇద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే, వీరి పెళ్లికి ప్రగతి తల్లిదండ్రులు నిరాకరించారు.కుటుంబ ఒత్తిడితో, ఈ నెల 5న ప్రగతిని బలవంతంగా దిలీప్ అనే యువకుడితో వివాహం చేయించారు.పెళ్లయిన తర్వాత తన ప్రియుడిని వదిలి భర్తతో జీవించడం ప్రగతికి ఇష్టం లేక, దిలీప్ను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.
కాంట్రాక్ట్ కిల్లర్
బాధితుడి భార్య, ఆమె ప్రియుడు కలిసి దిలీప్ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహం తర్వాత ఇద్దరూ కలుసుకునేందుకు వీలు లేకపోవడంతో దిలీప్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షలు చెల్లించారు.రామాజీ మరికొందరితో కలిసి బైక్పై దిలీప్ను పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ దిలీప్పై దాడి చేశారు. ఆ తర్వాత తుపాకితో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకులు, నాలుగు లైవ్ కాట్రిడ్జ్లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్స్, ఆధార్కార్డు, రూ. 3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు
తీవ్ర గాయాలతో బాధపడుతున్న దిలీప్ను పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం అతడిని మరో మూడు ఆసుపత్రులకు తరలించారు. కానీ, తీవ్ర గాయాల కారణంగా ఈ నెల 20న ఔరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిలీప్ మృతి చెందాడు.ప్రగతి తన ప్రియుడి కోసం భర్తను హత్య చేయించడం, హత్యలో పూర్తిగా పాత్ర పోషించడం ఆమె జీవితాన్ని నాశనం చేసింది.