Jharkhand: జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని గర్హ్వా జిల్లా బహోకుదర్ గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన హత్యకేసు అందరినీ షాక్కు గురిచేసింది. గత నెల 11వ తేదీన బుద్ధనాథ్ సింగ్ అనే యువకుడితో 22 ఏళ్ల సునీత దేవికి వివాహం జరిగింది. ఈ వివాహం అనంతరం, కొత్త వధువు ఒక్కరోజు మాత్రమే భర్త ఇంటిలో గడిపి వెంటనే పుట్టింటికి తిరిగిపోయింది. తన భర్తతో జీవించడం ఇష్టం లేదని చెప్పిన ఆమెపై ఇరుపక్షాల పెద్దలు చర్చించి ఆమెను మళ్లీ భర్తతో కాపురానికి పంపించారు.

ప్రేమగా కనిపించిన మోసం..!
జూన్ 14న పెరట్లోని మొక్కల కోసం పురుగుల మందు అవసరమని భర్తను కోరింది. అంతే భార్య ప్రేమగా మాట్లాడిందన్న ఆనందంలో ఆగమేఘాల మీద వెళ్లి బుద్ధనాథ్ పరుగుల మందు కొని తెచ్చాడు. ఇక దాని తర్వాత ఆమె చేసిన చర్యలు తలదన్నే మోసపూరితంగా ఉండటం దర్యాప్తులో స్పష్టమైంది. జూన్ 15న భర్త కోసం స్పెషల్గా చికెన్ కర్రీ వండి సమోసాలతో వడ్డించింది. ఆనక పక్కనే కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. అయితే భోజనం తర్వాత కాసేపటికే బుద్ధనాథ్ తీవ్ర అశ్వస్థతకు గురయ్యాడు. బంధువులు అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
దర్యాప్తులో వెలుగు చూసిన షాకింగ్ నిజాలు
ఆ మొదటి రోజునే కొత్త కోడలు భర్తను హత్య చేసిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాంకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో సునీత అత్తపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని, ఆ తర్వాత తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించినట్లు రాంకా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) రోహిత్ రంజన్ సింగ్ తెలిపారు.
తన మొదటి ప్రయత్నం విఫలమైతే, బ్యాకప్ ప్లాన్గా సునీత తన బ్లౌజ్లో మరో రెండు పురుగుమందుల ప్యాకెట్లను భద్రపరిచిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బుద్ధనాథ్ చనిపోయినట్లు నిర్ధారనైన తర్వాత ఆమె మిగిలిన ప్యాకెట్లను సమీపంలోని పొదల్లో పారవేసిందని తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఇతరుల ప్రమేయం కూడా ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
Read also: Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టులో హర్షకుమార్ పిల్