Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదకర ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ (Balapur Police Station) పరిధిలో చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, అక్కాచెల్లెళ్లు, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే:
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన ఓ దంపతులు జీవనోపాధి కోసం ఇటీవల హైదరాబాద్కు వలస వచ్చారు. ఈ క్రమంలో బాలాపూర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె వినీలా (17) చిన్న కుమార్తె అఖిల (16) ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె మూడు నెలల క్రితం ఓ యువకుడిని ప్రేమించి అతనితో ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు పెద్దలను సంప్రదించడంతో పంచాయితీ పెట్టారు. వయస్సు లేదని కులాంతర వివాహం వద్దని పెద్దల సమక్షంలో అమ్మాయికి నచ్చజెప్పి తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.
ఉరి వేసుకుని ఆత్మహత్య
అప్పటి నుంచి ఇంట్లో ఒత్తిడి వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు తరచూ మందలించటం, వినీలా–అఖిలలపై నిఘా పెట్టడం మొదలయ్యాయి. ఇద్దరు అమ్మాయిలు తమ మాట వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిండటంతో తల్లిదండ్రులు వారి ఇద్దరిని మందలించారు. దీంతో వినీలా, అఖిల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ రెయిలింగ్ కు చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసుల స్పందన:
స్థానికుల సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రాథమిక వివరణ ఆధారంగా, ఇంట్లో నడిచిన మాటా మాండవ్యాలు, ఒత్తిళ్లే ఈ దారుణానికి దారితీసినట్లు అనుమానిస్తున్నారు.