మెగా బ్రదర్ నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉండే కార్పొరేషన్ పదవి నాగబాబుకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.మొదట నాగబాబును ఎమ్మెల్సీగా చేసి, కేబినెట్లోకి తీసుకురావాలనే ఆలోచన కూటమిలో ఉండేది. కానీ రాజకీయ సమీకరణాలు మారడంతో, నాగబాబును ఎమ్మెల్సీగా కాకుండా రాజ్యసభకు పంపాలనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. జనసేన భవిష్యత్ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాజిక సమతుల్యతను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ మార్పు అవసరమని పవన్ భావించినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ
వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానం బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ, జనసేన వర్గాల్లో మాత్రం నాగబాబును రాజ్యసభకు పంపాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కూటమిలోని మిత్రపక్షాలతో పవన్ ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఒకవేళ నాగబాబుకు రాజ్యసభ అవకాశం వస్తే, ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి కేటాయించే అవకాశాలను కూటమి పరిశీలిస్తోంది.
కార్పొరేషన్ ఛైర్మన్
రాజ్యసభ పదవి వచ్చే వరకు నాగబాబుకు కేబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై స్పష్టత రావొచ్చు. రాష్ట్రంలోని పర్యావరణ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండే ఓ కీలక కార్పొరేషన్ బాధ్యతలు నాగబాబుకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కూటమి సమావేశం
ఈ నిర్ణయం జనసేన భవిష్యత్ రాజకీయ వ్యూహానికి కీలక మలుపుగా మారనుంది. కూటమి సమావేశంలో నాగబాబు భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం ఎలాంటి రూపం దాల్చబోతుందనేది తేలనుంది. కానీ ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ నాగబాబును కీలకమైన స్థానంలో కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబు పవన్ చర్చలు
నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తు లో భాగంగా ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు తప్పుకున్నారు. ఇక, రాజ్యసభ ఇస్తారనే హామీతో ఆయన నిరీక్షించారు. కూటమికి కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు దక్కాయి. మారిన సమీకరణాలతో ఆ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు. అదే సమయంలో నాగబాబు కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీ అయిన తరువాత కేబినెట్ లో చేరుతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయం అని అందరూ భావించారు.