తమిళ నటుడు విశాల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన వార్తతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆయన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుండటం ఒక ఊరట కలిగించే విషయం.

వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన విశాల్
మే 11న నిర్వహించిన ‘మిస్ కువాగం 2025’ అనే ట్రాన్స్జెండర్ల అందాల పోటీకి విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తరువాత, వేదికపై ఉన్న విశాల్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీనితో అభిమానులు, కార్యక్రమ నిర్వాహకులు ఆయనకు తగు ప్రాథమిక చికిత్స చేశారు. దీనితో ఆయన కాస్త తేరుకున్నారు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కె.పొన్ముడి విశాల్ను మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు హెల్త్ చెకప్ చేసిన తరువాత విశాల్ను డిశ్చార్జ్ చేశారు.
ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విశాల్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టే విధంగా ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రాన్స్జెండర్ల కోసం నిర్వహించిన కార్యక్రమంలో వెళ్లిన విశాల్ అలసటతో మూర్చపోయారు. వాస్తవానికి ఆ రోజు మధ్యాహ్నం విశాల్ భోజనం చేయలేదు. కేవలం జ్యూస్ మాత్రమే తాగారు. దీనితో ఆయన నీరసం వచ్చి స్పృహతప్పి పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పారు. భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, సమయానికి కచ్చితంగా భోజనం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఆయన బాగానే కోలుకున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదులు” అని పేర్కొంది.
అనారోగ్యం పట్ల అభిమానుల ఆందోళన
ఇటీవల కాలంలో విశాల్ ఆరోగ్యంపై తరచూ వార్తలు రావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో ‘మద గజ రాజా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా విశాల్ తీవ్ర అనారోగ్యంతో కనిపించాడు. కనీసం మాట్లాడలేక, నిలబడలేక పోయాడు. దీనితో అభిమానులు చాలా ఆందోళన చెందారు. అయితే జ్వరం రావడం వల్ల ఇదంతా జరిగిందని విశాల్ అభిమానులకు చెప్పారు. అంతేకాదు విశాల్ 3 నుంచి 6 నెలలపాటు షూటింగ్ చేయలేరని వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. అవన్నీ వచ్చి రూమర్సే అని తేల్చి చెప్పారు.
విశాల్ కెరీర్లో ప్రత్యేకత
విశాల్ తన కెరీర్ను సమర్థవంతంగా కొనసాగిస్తూ, నటనతో పాటు నిర్మాణంలో కూడా అడుగుపెట్టి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన ‘మద గజ రాజా’ సినిమా పలు కారణాల వల్ల 12 ఏళ్లు ఆలస్యంగా విడుదలై, జనవరి 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకత్వం వహించగా, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు.
Read also: Trivikram Srinivas : సినిమా పాట వల్ల ఆయన అక్కడే బందీ అయ్యారన్న త్రివిక్రమ్