సినీ జీవితంలోని ఒడిదుడుకులు – శింబు కన్నీటి మాటలు
చెన్నైలో శనివారం రాత్రి జరిగిన ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల వేడుక భావోద్వేగ క్షణాలకు వేదికగా మారింది. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టనష్టాలను, వివాదాలను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు, ఎదురుదెబ్బల మధ్య తన ప్రయాణం సాగిందని చెప్పారు. తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను పునఃస్మరించుకుంటూ తన తల్లిదండ్రులు, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తుల అండ తప్ప తనకు ఇంకేమీ ఆశ్రయం లేదని అన్నారు.
“కష్టాల్లో తల్లిదండ్రులే నా బలం”
శింబు మాట్లాడుతూ, “నా ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను చూశాను. ఎన్నో వివాదాలు, ఒంటరితనాన్ని అనుభవించాను. ప్రతి కష్ట సమయంలో నా తల్లిదండ్రులు అండగా నిలబడి, ధైర్యం చెప్పారు” అంటూ శింబు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు.
“కమల్ హాసన్ నా మార్గదర్శి”
తనకు నటుడిగా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి కమల్ హాసన్ అని, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే తనకు మార్గదర్శకమని తెలిపాడు. “కమల్ హాసన్ (Kamal Haasan) సినిమాలు చూస్తూ పెరిగాను. నటుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నాలాంటి ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి. ఒకానొక దశలో నేను వరుస సినిమాలు చేస్తున్నప్పుడు, కమల్ హాసన్ను రీప్లేస్ చేసే నటుడు వచ్చాడని చాలామంది అన్నారు. నిజం చెప్పాలంటే ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నా దృష్టిలో ఆయనొక గొప్ప మార్గదర్శి” అంటూ శింబు కన్నీటి పర్యంతమయ్యారు.

“బీప్ సాంగ్ వివాదం – నాకు నిలబడింది రెహమాన్ గారే”
‘బీప్ సాంగ్’ వివాదం, ‘రెడ్ కార్డ్’ (Red card) జారీ వంటి క్లిష్ట పరిస్థితుల గురించి కూడా శింబు ప్రస్తావించాడు. “సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇప్పటికీ పెడుతూనే ఉన్నా. నా ‘బీప్ సాంగ్’ విడుదలైనప్పుడు పెద్ద వివాదం చెలరేగింది. అది నా జీవితంలో చాలా కష్టమైన దశ. ఆ సమయంలో ఆయన తన పనులన్నీ పక్కనపెట్టి నా సినిమా కోసం పనిచేశారు. నాకు ఎంతగానో అండగా నిలిచారు. గాయకుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. ఇప్పటివరకు నేను వివిధ భాషల్లో 150 పాటలు పాడానంటే దానికి కారణం ఆయనే” అని రెహమాన్కు కృతజ్ఞతలు తెలిపాడు.
“రెడ్ కార్డ్ సమయంలో నా వెంట ఉన్నది మణిరత్నం గారే”
రెడ్ కార్డ్ (Red card) వివాదం గురించి మాట్లాడుతూ “నాకు రెడ్ కార్డ్ జారీ చేశారంటూ వార్తలు వచ్చినప్పుడు, ఏ నిర్మాత కూడా నాతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. సినిమాల్లేక చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి క్లిష్ట సమయంలో నన్ను నమ్మి, నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి దర్శకుడు మణిరత్నం. ‘థగ్ లైఫ్’ సినిమా కోసం ఆయన నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు మొదట నేను నమ్మలేకపోయాను. తర్వాత ఆయన్ను కలిసి ‘నిజంగా మీరేనా నాకు ఫోన్ చేసింది?’ అని అడిగాను. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’లో నటించే అవకాశం చేజారినా, ఇప్పుడు ‘థగ్ లైఫ్’లో అవకాశం ఇచ్చారు. ఆయన ఎప్పటికీ నాకు గురువు, గాడ్ ఫాదర్ లాంటి వారు” అని శింబు ఉద్వేగంగా వివరించారు.
“థగ్ లైఫ్ నా జీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం అవుతుంది”
‘థగ్ లైఫ్’ తనకు మరోసారి పునరుద్ధానాన్ని ఇస్తుందని శింబు ఆశాభావం వ్యక్తం చేశారు. “ఈ సినిమా నాకు కొత్త శక్తిని ఇస్తుంది. మణిరత్నం గారి దర్శకత్వంలో చేయడం గొప్ప గౌరవం. ఇది నా కెరీర్ను మరో మెట్టుకు తీసుకెళ్తుంది,” అని విశ్వాసంగా చెప్పారు.
read also: Mukul Dev : ముకుల్ దేవ్ చివరి మాటల్లో చెప్పలేని వేదన:హన్సల్ మెహతా