చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తూ ఉంటే, దానికి చైనా వత్తాసు పలుకుతోంది. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు, ఎప్పుడూ అండగా ఉంటామని పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang yi) ఈ మేరకు హామీ ఇచ్చారు. ఫోన్ సంభాషణలో ప్రస్తుతం భారత్-పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులను వాంగ్ యీ(Wang yi) కు ఇషాక్ దార్ వివరించినట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది.
భారత భద్రతా బలగాల స్పందన
సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ చాలా సంయమనంతో ఉందని, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని వాంగ్ యీ (Wang yi) అన్నారు. తమ మిత్రదేశమైన పాకిస్థాన్కు చైనా అన్నివేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామిగా ఉంటుందని, తమ స్నేహ బంధం విడదీయరానిదని వాంగ్ యీ పేర్కొన్నారు. మరోవైపు ఇషాక్ దార్, యూఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్తోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-పాక్లు కాల్పుల విరమణకు అంగీకరించడానికి అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అలాగే తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్తో మాట్లాడిన ఇషాక్ దార్ ప్రస్తుతం భారత్-పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులను వివరించారు. భారత భద్రతా దళాలు పాక్ డ్రోన్ దాడులకు సమర్థవంతంగా ప్రతిస్పందించాయి. కొన్ని డ్రోన్లు కూల్చివేయబడ్డాయి, సరిహద్దు గస్తీ బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.

పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు
పాకిస్థాన్ మరోసారి నమ్మక ద్రోహానికి పాల్పడింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే జమ్మూ కశ్మీర్తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా రాజస్థాన్, గుజరాత్లపై డ్రోన్ దాడులకు తెగబడింది. అయితే ఈ దాడులను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. పంజాబ్, హరియాణా, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ సరిహద్దుల వద్ద డ్రోన్లు గాలిలో కనిపించాయి.
భారత ఆర్మీకి చర్యల స్వేచ్ఛ
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ మండిపడింది. భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం రాత్రి దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ‘కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదు. డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను పాకిస్థాన్ ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత కొన్ని గంటలుగా పాక్ సరిహద్దుల వెంబడి కాల్పులకు, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఇది అత్యంత దుర్మార్గం’ అని అన్నారు. అంతేకాదు కాల్పుల వివరణ ఒప్పందం ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్థాన్దేనని మిస్రీ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ దాడులకు భారత సైన్యం తగిన విధంగా జవాబిస్తుందన్నారు. పాక్ అతిక్రమణలను, చొరబాటులను నిలువరించేందుకు భారత సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికైనా పాకిస్థాన్ దాడులు నిలువరిస్తుందని ఆశిస్తున్నట్టు విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. చైనా పాకిస్థాన్కు బహిరంగ మద్దతు ప్రకటించగా, పాక్ విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. భారత్ దీనిని తీవ్రంగా ఖండిస్తూ, భద్రతా చర్యలు ముమ్మరం చేసింది. ఇది భారత్–పాక్ సంబంధాల్లో మళ్లీ ఉద్రిక్తతను పెంచే ప్రమాదం కలిగి ఉంది.
Read Also: Qatar: ఖతార్ రాజ కుటుంబం ట్రంప్కి లగ్జరీ విమానం గిఫ్ట్