అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను అమలు చేసే దిశగా- ముఖ్యమంత్రి రేఖా గుప్తా సారథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయాలను తీసుకుంది. హామీలను అమలు చేయడానికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేపట్టింది. ఇందులో మహిళల భద్రత, విద్య- వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందక్కడి కమలనాథుల సర్కార్.

తొలిసారిగా సమావేశమైంది ఢిల్లీ అసెంబ్లీ
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా సమావేశమైంది ఢిల్లీ అసెంబ్లీ. రేఖా గుప్తా బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. లక్ష కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వయంగా ఆమెనే పర్యవేక్షిస్తోన్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పలు అంశాల గురించి ప్రస్తావించారు. దీన్ని చారిత్రాత్మక బడ్జెట్గా అభివర్ణించారు. 10 సంవత్సరాల పాటు ఢిల్లీని పరిపాలించిన అవినీతి, అసమర్థ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి జనం చరమగీతం పాడారని రేఖా గుప్తా అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఆతిషి సారథ్యంలో ఆప్ పాలన భ్రష్టు పట్టిందని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఇష్టారీతిన సాగిందని విమర్శించారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు 2,144 కోట్ల రూపాయలను కేటాయించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 50,000 సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు.
అర్హులైన ప్రతి మహిళకూ ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకానికి 5,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రేఖా గుప్తా తెలిపారు. దీనితోపాటు అన్ని చోట్ల కూడా అటల్ క్యాంటీన్లను నెలకొల్పబోతోన్నామని, దీనికోసం 100 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నట్లు చెప్పారు.