ఉగాది పండుగ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించబడింది. వాడవాడలా ప్రజలు షడ్రుచుల పచ్చడిని ఆస్వాదిస్తూ, నూతన ఆశలతో, సంకల్పాలతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.
ఉగాది శుభాకాంక్షలు
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిద్దాం అన్నారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని చంద్రబాబు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ సందేశం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగాది సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా “జీవితం కష్టసుఖాల సమ్మేళనమే – మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు – సజీవంగా నిలుపుతాయి అని ఆయన అభిప్రాయపడ్డారు.ఉగాది రోజున పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ పాలనపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పంచాంగ శ్రవణం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించి, రాష్ట్రం, దేశానికి ఏ విధంగా ఈ ఏడాది ఉండబోతుందో వివరణ ఇచ్చారు.ప్రజలు ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ, భవిష్యత్తులో మంచి మార్పులు రావాలని ఆకాంక్షించారు.
ఉగాది సందడి
తెలుగువారు సాంప్రదాయ దుస్తులు ధరించి, మంగళ హారతులతో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఇళ్ల ముందు రంగవల్లులు,అలంకరణలు, ప్రత్యేకంగా వంటకాలు చేసి, కుటుంబ సమేతంగా వేడుకలను జరుపుకున్నారు.ముఖ్యంగా పిల్లల నుండి వృద్ధుల వరకు ఉగాదిని ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఉగాది వేడుకలు
ఉగాది పర్వదినం పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్నీ చిక్కుముడులేనని, వాటిని ఒక్కొక్కటిగా విప్పుతున్నామని చెప్పారు. ప్రజలు ముందు అనే నినాదంతో తమ సర్కారు ముందుకు వెళుతోందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను సమన్వయం చేస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ అవసరం ఎక్కువని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు తాను సెల్ ఫోన్, ఐటీలను ప్రోత్సహిస్తే చాలామంది విమర్శించారని గుర్తుచేసుకున్నారు. సెల్ ఫోన్ తిండిపెడుతుందా అంటూ కామెంట్లు చేశారన్నారు.