ఏలూరు/ పోలవరం ప్రభాతవార్త:
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన చేసేందుకు విచ్చేయుచున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం ప్రాజెక్ట్ సైట్ లో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు పోలవరం విచ్చేస్తారని, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులలో డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం, గ్యాప్ 1, గాప్ 2 , వైబ్రో కంప్రెషన్, తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారన్నారు.

ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించే ప్రదేశాలలో పనుల ప్రగతి సూచించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసి, వివరాలు సీఎం కి తెలియజేయాలన్నారు. ఆయా ప్రదేశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయాలనీ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే శాసనసభ్యులు, ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రివర్యులు పాల్గొనే ప్రదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, వడదెబ్బ నివారణకు సంబందించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
అంతకుముందు డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం, గ్యాప్ 1, గాప్ 2 , వైబ్రో కంప్రెషన్, తదితర పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ రమణ, పోలవరం ప్రాజెక్ట్ సూపెరింటెండెంటింగ్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, డిఈ డి.శ్రీనివాస్, సిఐ బాల్ సురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.