ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025’ కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భారత్ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి రేటు, స్టార్టప్ రంగం, విద్యావ్యవస్థ, ప్రైవేట్ రంగ అభివృద్ధి, ఐఐటీ మద్రాస్ ప్రాముఖ్యతపై ఆయన విశ్లేషణ ఇచ్చారు.

భారత్ వృద్ధిరేటు – ప్రపంచంలోనే అగ్రస్థానంలో
చంద్రబాబు మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 5వ స్థానానికి ఎదిగిందని పేర్కొన్నారు. ప్రపంచదేశాల దృష్టి ఇప్పుడు భారత్ వైపు మళ్లిందని, ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. 1991 సంస్కరణల తర్వాత భారత్ అభివృద్ధి బాట పట్టిందని, అదే సమయంలో చైనా కూడా ఆర్థిక సంస్కరణలు చేపట్టి, ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని తెలిపారు. భారత్ కూడా అదే దిశగా ముందుకు సాగి అగ్రస్థానానికి చేరుకోవాలని సూచించారు.
మద్రాస్ ఐఐటీలో తెలుగువారు అధిక సంఖ్యలో
ఐఐటీ మద్రాస్ గురించి చంద్రబాబు ప్రసంగిస్తూ, ఇది దేశవ్యాప్తంగా నంబర్ వన్ విద్యాసంస్థగా నిలిచిందని అన్నారు. మద్రాస్ ఐఐటీలో 35% నుంచి 40% వరకు తెలుగు విద్యార్థులే ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ సంస్థ అనేక స్టార్టప్లను ప్రోత్సహిస్తూ, ఇప్పటికే 80% స్టార్టప్లు విజయవంతం అయ్యాయని చెప్పారు. ప్రత్యేకంగా ‘అగ్నికుల్’ స్టార్టప్ గురించి ప్రస్తావిస్తూ, ఇది భారత అంతరిక్ష రంగానికి గొప్ప విజయాన్ని తీసుకువచ్చిందని కొనియాడారు. భారతదేశ అభివృద్ధికి 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు కీలకమైనదని చంద్రబాబు తెలిపారు. 1990లలో భారత కమ్యూనికేషన్ రంగం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేదని, అప్పట్లో BSNL, VSNL వంటి సంస్థలే వ్యవహరించేవని గుర్తుచేశారు. అయితే ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ టెలికాం సంస్థలు రంగ ప్రవేశం చేయడం గేమ్ చేంజర్గా మారిందని చెప్పారు. ప్రైవేట్ రంగ ప్రవేశంతో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి సంస్థలు దేశంలో టెలికాం విప్లవాన్ని తీసుకొచ్చాయని, ఈ మార్పుతో డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలకు మద్దతు లభించిందని వివరించారు. టెక్నాలజీ అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను కలవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన తొలుత ఆసక్తి చూపలేదని చెప్పారు. అయితే తర్వాత బిల్ గేట్స్ను ఒప్పించి 45 నిమిషాల పాటు మాట్లాడినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సెటప్ చేయాలని బిల్ గేట్స్ను ఒప్పించానని, ఇప్పుడు అదే సంస్థకు తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్నారని పేర్కొన్నారు.
భారత – మేగా ప్రాజెక్టుల ప్రాధాన్యత
భారత అభివృద్ధిలో జనాభా ఒక కీలకమైన అంశమని చంద్రబాబు చెప్పారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్న వేళ, భారత్కు ఇంకా 40 ఏళ్ల పాటు అలాంటి సమస్య ఉండబోదని విశ్లేషించారు. మనం సమష్టిగా కృషి చేస్తే భారత్ త్వరలోనే అగ్రశ్రేణి దేశంగా అవతరిస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రకటనల ప్రకారం, భారత భవిష్యత్తు ప్రధానంగా టెక్నాలజీ, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక రంగ పురోగతి మీద ఆధారపడి ఉంది. భారత ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టులు, రైల్వే, హైవేలు, మెట్రో ప్రాజెక్టులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తదితర అంశాలు దేశాభివృద్ధికి దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ ప్రసంగంలో చంద్రబాబు ప్రధానంగా భారత ఆర్థిక పురోగతి, స్టార్టప్ అభివృద్ధి, టెక్నాలజీ విప్లవం, విద్యావ్యవస్థ, వంటి అంశాలను విశ్లేషించారు. దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగాలంటే అవకాశాలను వినియోగించుకోవాలని, యువత కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.