Sitaramula Kalyanam : వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ నెల 11న జరగనున్న కోదండరామస్వామి కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. తన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ దంపతులతో కలిసి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం ఐదు గంటలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అంతకుముందు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు
ముఖ్యమంత్రి రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను ఈవో వివరించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న గ్యాలరీలలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్టు ఈవో తెలిపారు.
ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు
ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపడతారు. కల్యాణ వేదిక ప్రవేశ మార్గంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.