ఫిబ్రవరి 13, 2025 న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. 1961లో అమలులోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేయడానికి ఈ కొత్త బిల్లు రూపొందించారు.పాత నిబంధనల్లో మార్పులు చేయడంతోపాటు, ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు.
పన్ను బిల్లు
కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఎందుకు ప్రవేశపెట్టారో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేసే ఈ బిల్లు, ప్రభుత్వం లెక్కల్లో చూపని డబ్బు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇది చాలావరకు అసలు నిబంధనలకు అనుగుణంగా,భాషను సరళీకృతం చేయడం, అనవసరమైన విభాగాలను తొలగించడం దీని లక్ష్యం, అక్రమార్కులను పట్టుకోవటానికి మరిన్ని డిజిటల్ ఆధారాల అన్వేషణకు ఇది మార్గం సుగమం చేయనుందని పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడంతోపాటు,అక్రమార్కులకు అడ్డుకట్టవేయనుంది.
కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్
కొత్త బిల్లు అధికారులకు వాట్సాప్, టెలిగ్రామ్, ఇమెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేసే హక్కును కల్పిస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు. అదనంగా, ఆర్థిక లావాదేవీలను దాచడానికి ఉపయోగించే వ్యాపార సాఫ్ట్వేర్, సర్వర్లను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేయగలదు.ఈ బిల్లు వెల్లడించని ఆదాయం విషయంలో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కవర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ టోకెన్లు, క్రిప్టోకరెన్సీలు, క్రిప్టోగ్రాఫిక్ వంటివి ఉంటాయి.

డిజిటల్ ఖాతా
శోధన, స్వాధీన కార్యకలాపాల సమయంలో వర్చువల్ డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను అధికారులకు అనుమతిని ఇస్తుంది. ఇది ఇమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లు, ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్సైట్లను కవర్ చేస్తుంది. పన్ను దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఖాతాల తనిఖీ కోసం యాక్సెస్ కోడ్లను ఓవర్రైడ్ చేసే అధికారాన్ని కూడా ఇది అధికారులకు ఇస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానం
కొత్త బిల్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో టాక్స్ అమలును తాజాగా ఉంచడంలో సహాయపడుతుందని, క్రిప్టోకరెన్సీల వంటి వర్చువల్ ఆస్తులను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడానికి సహాయపడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ అన్నారు. డిజిటల్ ఖాతాల నుండి వచ్చే ఆధారాలు అధికారులకు కోర్టులో పన్ను ఎగవేతను నిరూపించడానికి, పన్ను ఎగవేత మొత్తాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఆధారాలను అందిస్తాయి. లెక్కల్లో చూపించని నల్లధనాన్ని వెలికితీయటానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషించిందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు.మొబైల్ ఫోన్లలో గుప్తీకరించిన సందేశాల ద్వారా లెక్కల్లో లేని రూ.250 కోట్ల డబ్బు బయటపడింది. క్రిప్టో ఆస్తులకు సంబంధించిన వాట్సాప్ సందేశాల నుంచి ఆధారాలు కనుగొన్నాం. వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా లెక్కల్లో లేని రూ.200 కోట్ల డబ్బు బయటపడిందిఅని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.