పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఒక వైన్ షాపు వద్ద మద్యం కొంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీనితోపాటు ఆయన రోడ్డు పక్కన తన వాహనాన్ని ఆపి కూర్చున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు విడుదల చేశారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసు డీల్ చేస్తున్న ఏలూరు పోలీసులు, తూర్పు గోదావరి పోలీసులు ఈ ఫుటేజ్ తాము రిలీజ్ చేసింది కాదని చెప్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సీసీ కెమెరా ఫుటేజ్లో దృశ్యాలను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు ఐజీ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచీ ..
మార్చి 24న ప్రవీణ్ కుమార్ పగడాల హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచీ తూర్పుగోదావరి జిల్లాలోని కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారి పల్లపు ప్రాంతంలో పడిపోయి మరణించిన చోటు వరకు సేకరించిన వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ఇందులో ఉంది.
కొనసాగుతున్న దర్యాప్తు
ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొంతమూరు రహదారి వద్ద అదే రోజు రాత్రి 11.42 గం.లకు ప్రమాదానికి గురైనట్లు సీసీ టీవీ ఫుటేజ్లో కనిపిస్తోంది. మార్చి 25 ఉదయం అక్కడ ఆయన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో గాయాలతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహం కనిపించింది.
దీంతో ఆయన హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వరకు ఆయన ప్రయాణం చేసిన ప్రతిచోటా సీసీ టీవీ ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. అలాగే ఆయన ఎవరెవరినీ కలిశారనే దానిపైనా ఆరా తీస్తున్నారు. “విజయవాడ, రాజమహేంద్రవరంలోని దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించాం.” అని ఏలూరు పోలీసులు తెలిపారు. మార్చి 25 తెల్లవారుజామున ఆయన మృతదేహం కనిపించింది. అంతకు ముందు సీసీటీవీ ఫుటేజ్లో ఆయన కొవ్వూరు టోల్ గేట్ వద్ద బైక్ నడుపుతూ కనిపించారు.

తలకు గాయాలై చనిపోయి ఉంటారని పోలీసుల అంచనా
ఇది రోడ్డు ప్రమాదమని, బైక్ ప్రమాదవశాత్తు పల్లం ప్రాంతంలోకి జారిపడటంతో…ప్రవీణ్ కుమార్ తలకు గాయాలై చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. “ప్రవీణ్ కుమార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు ఆయన మృతిపై తమకు అనుమానాలున్నాయని చెప్పడంతో…అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం.” అని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ చెప్పారు.
12 చోట్ల సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించాం
“హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరిన తర్వాత మొట్టమొదట చౌటుప్పల్ టోల్ గేట్ వద్ద తొలి సీసీ టీవీ ఫుటేజ్ మధ్యాహ్నం 01.29 గం.లకు నమోదైంది. దాన్ని సేకరించాం. అక్కడి నుంచి ఆయన మరణించిన ప్రదేశం 381 కిలోమీటర్లు ఉంది. దాని తర్వాత ఆయన కనిపించిన మరో 12 చోట్ల సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించాం. చివరిదైన నయారా పెట్రోల్ బంక్ వద్ద ఫుటేజ్లో ఆయన వాహనం జాతీయ రహదారి పల్లపు ప్రాంతంలో పడినట్లు, ఆ సమయంలో అక్కడ దుమ్మురేగినట్లు కనిపిస్తోంది” అని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.