ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్పై కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరపగా, తాజాగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ రూ.6,000 కోట్లకు సంబంధించి సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాయ్పుర్, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఓ సీనియర్ పోలీసు అధికారి, ఆయన సన్నిహితుల ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది రాజకీయ కుట్ర: భూపేశ్ బఘేల్
ఇది రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్న చర్య అని మాజీ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. దీనిపై స్పందిస్తూ భూపేశ్ బఘేల్ ఆఫీస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ‘మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంటికి సీబీఐ వచ్చింది. ఏప్రిల్ 8,9 తేదీల్లో గుజరాత్లో జరగనున్న ఏఐసీసీ మీటింగ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన డ్రాప్టింగ్ కమిటీ సమావేశం కోసం బఘేల్ బుధవారం దిల్లీ వెళ్లాలి. కానీ, అంతకుముందే సీబీఐ ఆయన ఇంటికి వచ్చి దాడులు నిర్వహిస్తోంది’ అని పోస్ట్లో పేర్కొంది. తాజా సోదాలపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే బఘేల్పై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్, శుభమ్ సోనీ, అనిల్ కుమార్తో పాటు 14మందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది.
మద్యం కుంభకోణం కేసులో దాడులు
ఇటీవల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. ఆ సోదాల సందర్భంగా రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ తనిఖీల అనంతరం తిరిగివెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడం వల్ల ఆ సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.