Tirupati Job Mela: ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో అపార అవకాశాలను వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్. ఏపీఎస్పీడీసీఎల్ వారి ఆధ్వర్యంలో, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ విభాగం సహకారంతో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని తిరుపతిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ సిఎండీ లోతేటి శివశంకర్, సంస్థ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు.
Read Also:RRB Recruitment: 22 వేల గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు!

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
శ్రీ సిటీ, నాయుడుపేట పారిశ్రామిక కేంద్రాల్లో వేలాది అవకాశాలు.
తిరుపతి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు కలిగిన జిల్లాలలో ఒకటిగా ఎదుగుతోందని తెలిపారు. ప్రత్యేకంగా శ్రీ సిటీ లోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ వంటి పారిశ్రామిక కేంద్రాల ద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. సుమారు 55 దేశాల నుండి వచ్చిన పెట్టుబడిదారులతో 500కు పైగా కంపెనీలు జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
స్కిల్స్ పెంపొందించుకుంటే ప్రైవేట్ రంగంలో వేగవంతమైన ఎదుగుదల.
జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు, హెచ్ఆర్ మేనేజర్లు అభ్యర్థులతో నేరుగా ముఖాముఖి చర్చలు జరిపి నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ప్రారంభ వేతనం తక్కువగా ఉన్నప్పటికీ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ఒకటి నుండి రెండు సంవత్సరాల్లో మంచి వేతనంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగవచ్చని యువతకు అవగాహన కల్పించారు. విదేశీ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు కంటే ప్రైవేట్ రంగానికే అధిక ప్రాధాన్యత ఉందని, అభివృద్ధి, వేతన వృద్ధి, అంతర్జాతీయ అవకాశాలు ప్రైవేట్ రంగంలో విస్తృతంగా లభిస్తున్నాయని వివరించారు. యువత తమ మైండ్సెట్ను మార్చుకుని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు.
అలాగే కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు సరైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే సంస్థలకు దీర్ఘకాలికంగా నిబద్ధత కలిగిన సిబ్బంది లభిస్తారని తెలిపారు. జిల్లాలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, యువత ఈ అవకాశాలను వినియోగించుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
జాబ్ మేళాలో పాల్గొన్న ప్రతి అభ్యర్థి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, పాల్గొన్న సంస్థలు అర్హులైన అభ్యర్థులకు ప్లేస్మెంట్ ఉత్తర్వులు అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ హెచ్ఆర్డీ డైరెక్టర్ కె. గురవయ్య, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ పి. అయుబ్ ఖాన్, ఫైనాన్స్ డైరెక్టర్ రామ్మోహన్ రావు, తిరుపతి డిఎస్డివో ఆర్. లోకనాథం, సంస్థల సిజిఎంలు, జిఎంలు, ఏపీఎస్పీడీసీఎల్ మరియు ఏపీ ఎస్ఎస్డిసి సిబ్బంది, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: