దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET UG 2025 (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. వైద్య విద్యలో ప్రవేశానికి ప్రధానమైన ఈ పరీక్షలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను నిరూపించారు.

22 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలో హాజరు
ఈ సంవత్సరం NEET UG 2025 పరీక్షను మే 4న దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక కీ ని విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఎన్టీఏ తుది ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను ఈమెయిల్ ద్వారా లేదా తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో అప్లికేషన్ నంబర్ను ఎంటర్ చేసి చూసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది.
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల విజయ గాధ
ఈ ఫలితాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విశేషంగా రాణించారు. తెలంగాణ నుంచి ఏకంగా 41,584 మంది విద్యార్థులు నీట్లో అర్హత సాధించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకును కైవసం చేసుకోగా, షణ్ముఖ నిషాంత్ 37వ ర్యాంకు, మంగరి వరుణ్ 46వ ర్యాంకు, యండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంకు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దర్బా కార్తీక్రామ్ 19వ ర్యాంకు, కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు.
ఈ విజయవంతమైన ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధుల కృషి, తల్లిదండ్రుల త్యాగం, మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకతను ప్రతిబింబిస్తున్నాయి.
వైద్య విద్యలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభానికి సిద్ధం
NEET UG 2025 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను అనుసరించి కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.
నీట్ యూజీ 2025 పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://neet.nta.nic.in/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది.
Read also: TG CPGET: 18 నుంచి సీపీగెట్-2025 దరఖాస్తుల స్వీకరణ