యూకేలో ఇద్దరు సిక్కులపై జరిగిన విద్వేషపూరిత దాడి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వోల్వర్హాంప్టన్ నగరంలోని ఒక రైల్వే స్టేషన్ వెలుపల గత శుక్రవారం (ఆగస్టు 15) ఈ దారుణ ఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ముగ్గురు యువకులు ఇద్దరు సిక్కులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. బాధితులు కింద పడిపోయినా, వారి తలపాగాలు ఊడిపోయినా పట్టించుకోకుండా ఒక యువకుడు వారిని పదేపదే కాలితో తన్నడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్ట్(Arrest) చేశారు. అయితే, విచారణ అనంతరం వారిని బెయిల్పై విడుదల చేసినట్లు సమాచారం.
దాడిని ఖండించిన సుఖ్బీర్ సింగ్ బాదల్
ఈ దాడిని సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు. “ఇది సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న జాత్యహంకార విద్వేష దాడి. ఎల్లప్పుడూ అందరి బాగోగులు కోరుకునే సిక్కులపై ఇలాంటి దాడులు జరగడం చాలా దారుణం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూకేలో నివసిస్తున్న సిక్కుల భద్రత గురించి అక్కడి ప్రభుత్వంతో చర్చించాలని ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు విజ్ఞప్తి చేశారు.

కేసు నమోదు దర్యాప్తు
ఈ ఘటనపై బ్రిటిష్ రవాణా(British Transport) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. “రైల్వే నెట్వర్క్లో ఇలాంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోము. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది” అని వారు ఒక ప్రకటనలో తెలిపారు. వోల్వర్హాంప్టన్ ఎంపీ సురీనా బ్రాకెన్రిడ్జ్ కూడా ఈ దాడిని ఖండించారు. వోల్వర్హాంప్టన్ నగరం విభిన్న సంస్కృతులకు నిలయమని, ప్రజలందరూ సంయమనంతో, ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: