భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ద్రవీభవింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వస్తున్న తరుణంలో, ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా వెనుకడుగు వేయడం విశేష చర్చనీయాంశంగా మారింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యల ప్రకారం, టెస్లా ప్రస్తుతం భారతదేశంలో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో లేదు. షోరూమ్లు స్థాపించడంపైనే దృష్టి సారించిందని స్పష్టత ఇచ్చారు.

టెస్లా భారత ప్రవేశంపై అనిశ్చితి
అమెరికాలో ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి నాంది పలికిన టెస్లా, భారత మార్కెట్లో ప్రవేశించాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. CEO ఎలాన్ మస్క్ పలు సందర్భాలలో ఈ విషయాన్ని వ్యక్తీకరించినప్పటికీ, దిగుమతి సుంకాలు, భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల నూతన ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఈవీ విధానం
భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఇటీవల ఒక నూతన ఈవీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ముఖ్య ఉద్దేశం, టెస్లా వంటి అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలను ఆకర్షించి, ఇక్కడ ఉత్పత్తి యూనిట్లను స్థాపించేలా చేయడం. ఈ కొత్త పాలసీ ప్రకారం, భారతదేశంలో ఈవీల తయారీ కోసం కనీసం 486 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,000 కోట్లు) పెట్టుబడి పెట్టే కంపెనీలకు పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను 15 శాతం తక్కువ దిగుమతి సుంకంతో దిగుమతి చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. ప్రస్తుతం, దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై సుంకం 70 శాతం వరకు ఉంది. ఈ ప్రయోజనాలు పొందాలంటే కంపెనీలు అనుమతి పొందిన మూడేళ్లలోపు భారతదేశంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఉత్పత్తిని ప్రారంభించాలి. అలాగే, నిర్దిష్ట స్థానిక సోర్సింగ్ నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ చర్య ద్వారా స్థానిక ఉత్పత్తి పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని, భారతీయ కొనుగోలుదారులకు ధరలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
విదేశీ కంపెనీల నుంచి ఆసక్తి
టెస్లా స్వల్పకాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ, మెర్సిడెస్-బెంజ్, వోక్స్వ్యాగన్ వంటి ఇతర అంతర్జాతీయ కంపెనీలు భారత ఈవీ పాలసీ పట్ల ఆసక్తి చూపాయని మంత్రి కుమారస్వామి తెలిపారు. ‘భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం’ (ఎస్పీఎంఈపీసీఐ) ,(Scheme to Promote Manufacturing of Electric Passenger Cars in India)గా పిలిచే ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రభావం
ఇటీవల టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి దేశీయ సంస్థలు ఇప్పటికే భారీగా ఈవీ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టి, మార్కెట్లో తమ స్థానం బలపర్చుకున్నాయి. ఈ కంపెనీలు దేశీయ ఈవీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్నాయి. విదేశీ కార్ల తయారీదారులకు సుంకాలు తగ్గించడం వల్ల స్థానిక పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తూ, గతంలో ఈ చర్యను వ్యతిరేకించాయి.
గణాంకాలపై ఓ చూపు
ప్రస్తుతం భారతదేశ మొత్తం కార్ల అమ్మకాలలో ఈవీల వాటా కేవలం 2.5 శాతం మాత్రమే. 2024లో అమ్ముడైన 43 లక్షల కార్లలో సుమారు 1.1 లక్షలు మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు. కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన దిగుమతులను తగ్గించే ప్రణాళికలో భాగంగా 2030 నాటికి ఈవీల వాటాను 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.