నేను అధ్యక్షుడిని, అమెరికన్ ప్రజలను గౌరవిస్తాను
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల భేటీ నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఓవల్ ఆఫీసులో ఆ ఇద్దరు నేతలు మీడియా ముందే చిర్రుబురులాడుకున్నారు. ఈ భేటీ అనంతరం జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్నకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఘటనపై మాట్లాడారు. వైట్హౌస్లో జరిగిన ఘటనపై ట్రంప్నకు క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉందా అని ఓ విలేకరి ప్రశ్నించారు.
ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమే
జెలెన్స్కీ దీనికి బదులిస్తూ.. అలాంటిదేమీ లేదు. నేను అధ్యక్షుడిని, అమెరికన్ ప్రజలను గౌరవిస్తాను. నేను ఏదో తప్పుచేశానని అనుకోవడం లేదు అని అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటూ అమెరికాను ఉద్దేశించి అన్నారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టంచేశారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య సంబంధం పైనా జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని.. తమవైపే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రష్యాపై ఉన్న అభిప్రాయాన్ని తాను మార్చుకోలేనని స్పష్టంచేశారు.

డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉక్రెయిన్ లేదు
కాగా, ట్రంప్తో జెలెన్స్కీ రష్యా-ఉక్రెయిన్ల మధ్య శాంతిఒప్పందంతో పాటు కీవ్లోని అరుదైన ఖనిజాల తవ్వకం వంటి కీలక అంశాలపై మాట్లాడేందుకు భేటీ అయ్యారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ఒత్తిడి చేశారు. దీంతో.. ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని, ఇది అవమానకరంగా ఉందని ట్రంప్ ఖండించారు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉక్రెయిన్ లేదంటూ మండిపడ్డారు. దీనికి జెలెన్స్కీ కూడా అంతేస్థాయిలో బదులిచ్చారు. తమ దేశంలో తాము ఉంటున్నామని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదన్నారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.