ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం కొత్త ఊపుని అందుకుంటోంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి (Nakkapalli) మండలంలోని రాజయ్యపేట వద్ద దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం స్థాపనకు అర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ సంస్థలు ముందుకు రావడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఈ కర్మాగారాన్ని మొదటి దశలోనే 70 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో నిర్మించబోతున్నారు. సంవత్సరానికి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం 2,200 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించడం అభివృద్ధి దిశలో ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు.

నవంబర్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. యూకేలో జరిగిన బిజినెస్ ఫోరమ్లో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Ease of Doing Business స్థాయిలోనే కాకుండా Speed of Doing Business ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వలన కేవలం 15 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలు, విశాఖలో ఏర్పాటు కానున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి కొత్త రూపురేఖలు దిద్దనున్నాయి. ఈ ప్రాజెక్టులు ఒకవైపు ఉద్యోగావకాశాలను సృష్టించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ వంటి మౌలిక రంగ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉక్కు అవసరాలను తీర్చడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశ పారిశ్రామిక మ్యాప్లో అగ్రగామిగా నిలిచే అవకాశం ఉన్నది.