హైదరాబాద్: జిల్లాల కుదింపుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ…కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లాని తీసేయాలని కాని కొత్త జిల్లాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 621 మండలాలు, 76 రెవిన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయనిమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు.
రాష్ర్ట ప్రభుత్వాలు నిధుల కోసం కేంద్రం వద్దకు తరచూ వెళ్తాయని.. వెళ్లిన ప్రతిసారీ నిధులు రావని అన్నారు. తమది పేదల ప్రభుత్వమని.. పేదల కోసం పని చేస్తుందని వెల్లడించారు. ఇకపోతే.. సీతక్క మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్, జులై లో గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేశామన్నారు. సర్వే లో 4 లక్షల 49 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు లేవనీ గుర్తించామని వివరించారు. 3 లక్షల 21 వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా లక్షా 28 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు అందించాల్సిన అవసరముందని వెల్లడించారు.
కాగా, తెలంగాణలో పలు కొత్త జిల్లాలు రద్దు కానున్నాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని.. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలుగా ప్రకటించనుందనే వార్తలు వచ్చాయి. అసిఫాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, నారాయణపేట, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, గద్వాల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దు అవుతాయనే ప్రచారం జరుగుతోంది.