తెలంగాణ శాసనసభలో కృష్ణా నదీ జలాల వాటాపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు చట్టబద్ధంగా దక్కాల్సిన వాటా 490 టీఎంసీలు అని ఆయన గణాంకాలతో వివరించారు. అయితే, ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలనే కేటాయించిందని, దీనిపై అప్పట్లో సరైన అభ్యంతరం వ్యక్తం చేయలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో అప్పటి అధికారుల పాత్రను కూడా ఆయన తప్పుబట్టారు. నాటి ఈఎన్సీ మురళీధర్ రావు తెలంగాణకు ఉన్న హక్కులను విస్మరించి, కేవలం 299 టీఎంసీలే అని తప్పుడు నివేదిక ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
AP: స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన రవి నాయుడు
ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 490 టీఎంసీల నీటి వాటా కోసం కేంద్రంతో పోరాడాల్సిన కేసీఆర్, అందుకు విరుద్ధంగా 299 టీఎంసీలకే అంగీకరిస్తూ సంతకం చేయడం అత్యంత దారుణమని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టి కేసీఆర్ చేసిన ఆ సంతకమే నేడు రాష్ట్ర పాలిట ‘మరణశాసనంగా’ మారిందని రేవంత్ అభివర్ణించారు. ఆనాడు జరిగిన ఆ ఒప్పందం వల్లే నేడు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన సభకు వివరించారు.

ఈ చారిత్రక తప్పిదం వల్ల దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు సాగునీటి పరంగా తీవ్రంగా నష్టపోయాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, భవిష్యత్తులో కృష్ణా బోర్డు (KRMB) వద్ద మరియు న్యాయస్థానాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో జరిగిన అన్యాయంపై శ్వేతపత్రం విడుదల చేసి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com