ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా అంబటికి ఫోన్ చేసి పరామర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని జగన్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం అల్లిన కుట్రలు ల్యాబ్ నివేదికలతో భగ్నం కావడంతో, ఆ నిజాన్ని తట్టుకోలేకనే వైసీపీ నేతలపై పక్కా ప్లాన్తో దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని అంబటికి జగన్ భరోసా ఇచ్చారు.
Ambati Rambabu : ఇక అసలు సినిమా అంబటికి చూపిస్తాం – కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
జగన్ తన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని భక్తుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పుడు తన తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై గూండాలతో హత్యాయత్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు రాడ్లు, కర్రలతో దాడికి యత్నిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరాచకాలపై రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని, విధుల్లో విఫలమైన డీజీపీ, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు తమ పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేస్తారని ఆయన వెల్లడించారు.

మరోవైపు అంబటి రాంబాబు తనదైన శైలిలో అధికార పార్టీకి సవాల్ విసిరారు. “చంద్రబాబు రెడ్ బుక్ పాలనకు నేను భయపడను.. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి” అంటూ గర్జించారు. తనను జైలుకు పంపాలని చూస్తే సిద్ధంగా ఉన్నానని, ‘ఐ డోంట్ కేర్ చంద్రబాబు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చాక ఈ ‘కర్మ’ను వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అంబటి అరెస్టుకు పోలీసులు సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీగా గుంటూరుకు చేరుకుంటుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠ భరిత పరిస్థితులు నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com