ఆంధ్రప్రదేశ్లో నెయ్యి కల్తీ మరియు సరఫరా వివాదం ఇప్పుడు న్యాయపరమైన మలుపు తీసుకుంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేసిన అంశంపై బొత్స చేసిన ఆరోపణలు తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని హెరిటేజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రైవేట్ సంస్థపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని, వెంటనే ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో డిమాండ్ చేసింది. దీంతో ఏపీలో నెయ్యి రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.

ఈ వివాదానికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన ఒక సంచలన ఆరోపణ. 2014-19 మధ్య కాలంలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన మహారాష్ట్రకు చెందిన ‘ఇందాపూర్ డెయిరీ’తో హెరిటేజ్ సంస్థకు ‘చీకటి ఒప్పందం’ ఉందని ఆయన విమర్శించారు. అప్పట్లో హెరిటేజ్ నేరుగా కాకుండా, మరొక సంస్థ ముసుగులో నెయ్యి సరఫరా చేసిందని ఆయన పరోక్షంగా సూచించారు. అయితే, హెరిటేజ్ యాజమాన్యం ఈ వాదనను తీవ్రంగా ఖండించింది. తాము ఎప్పుడూ పారదర్శకమైన వ్యాపార విలువలను పాటిస్తామని, ఇందాపూర్ డెయిరీతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ బొత్స వ్యాఖ్యలను “దురుద్దేశపూరితమైనవి”గా అభివర్ణించింది.
Robot dog controversy : ఇండియా ఏఐ సమ్మిట్లో రోబో వివాదం, అసలు నిజం ఏమిటి?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (TDP-JSP-BJP) అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు ప్రతిదాడికి దిగుతూ పాత ఒప్పందాలను తెరపైకి తెస్తున్నారు. అయితే, ఒక కార్పొరేట్ సంస్థ నేరుగా రంగంలోకి దిగి లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నోటీసులకు బొత్స సత్యనారాయణ ఎలా స్పందిస్తారు? ఆయన దగ్గర తన ఆరోపణలకు సరిపడా ఆధారాలు ఉన్నాయా? లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ న్యాయపోరాటం ముందుముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com