హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు, అధికారులకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారుల నుంచి వర్షాల పరిస్థితిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అర్ధరాత్రి వరకు వర్షాలు కొనసాగే అవకాశం
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అర్ధరాత్రి వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, జీహెచ్ఎంసీ, పోలీసులు, ట్రాఫిక్, జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, రానున్న రెండు రోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వర్షాలు, వరదల వల్ల ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.
Read Also : Avocado : అవకాడోతో ఆడవాళ్లకు కలిగే లాభాలేంటో తెలుసా..