శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం(Srisailam temple)లో ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. జూలై 15 నుంచి 18 వరకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో భద్రతా పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో ఆలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు, పర్వదినాల సందర్బంగా భక్తుల ప్రవాహం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతి వారం స్పర్శ దర్శనానికి ప్రత్యేక సమయాలు
ఈ మధ్యకాలంలో ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకూ ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దర్శనానికి ఒకరోజు ముందుగా టికెట్ బుకింగ్ తప్పనిసరి. భక్తులు ఆన్లైన్లో లేదా కౌంటర్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థతో తక్కువ సమయంతో స్వామివారిని దగ్గర నుంచి దర్శించే అవకాశాన్ని భక్తులు పొందుతున్నారు.
భద్రతా చర్యల్లో భాగంగా నిర్ణయం
ఆలయ ప్రాంగణంలో భక్తుల కదలికలను నియంత్రించడానికి, మరింత క్రమబద్ధత కల్పించేందుకు ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జూలై 19 తర్వాత పరిస్థితిని పరిశీలించి మళ్లీ స్పర్శ దర్శనాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఈవో తెలిపారు.
Read Also : CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు