నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం (Accident ) హృదయ విదారకంగా మారింది. జాతీయ రహదారిపై దూసుకొచ్చిన టిప్పర్ లారీ, ఎదురుగా వస్తున్న మారుతి ఫ్రొనెక్స్ కారును అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి (7 Members Died ) చెందారు. ఢీకొట్టిన తర్వాత కొంతదూరం వరకూ టిప్పర్ కారు ను లాక్కెళ్లడంతో, వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. నెల్లూరు నుంచి కడప జిల్లా బద్వేల్ వెళ్తున్న ఈ కారు ఏపీ 40 హెచ్జీ 0758 నంబరు కలిగి ఉందని గుర్తించారు. మృతుల వివరాలు సేకరించడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.
ప్రమాద తీవ్రతకు కారు సగం భాగం టిప్పర్ లోపలకి ఇరుక్కుపోయింది. ఘటనా స్థలంలో పరిస్థితి భయానకంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను బయటకు తీయడానికి క్రేన్ను రప్పించాల్సి వచ్చింది. అనంతరం మృతులను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ లారీ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడమే కాక అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

ఇక ఇదే జిల్లాలో మరో సంఘటన ఆందోళన కలిగించింది. ఆత్మకూరు మండలం నబ్బీ నగరం వద్ద ఆర్టీసీ డ్రైవర్పై ఓ వ్యక్తి దాడి చేశాడు. వింజమూరు నుంచి బయలుదేరిన ఆత్మకూరు డిపో బస్సులో ఇప్పటికే 120 మంది ప్రయాణికులు ఉన్నందున, డ్రైవర్ వెంగల్ రెడ్డి తాతిరెడ్డిపల్లి వద్ద ఆపలేదు. బస్సులో తన కుటుంబసభ్యులను ఎక్కించలేకపోయిన వ్యక్తి ఆగ్రహంతో బైక్పై వెంబడించి, బస్సును అడ్డుపెట్టి ఆర్టీసీ డ్రైవర్పై తీవ్ర దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు రోడ్డు ప్రమాదం, మరోవైపు ప్రజా రవాణా సిబ్బందిపై దాడులు – ఈ రెండు సంఘటనలు నెల్లూరు ప్రజలను కలవరపరుస్తున్నాయి.