ప్రకాశం జిల్లాలోని ఒంగోలు (Ongole) పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రాత్రి 2 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ కంపనాలు సుమారు 2 సెకన్ల పాటు కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా లేచి బయటకు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే పెద్దగా నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (NCS) విడుదల చేసిన సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. సాధారణంగా 4 కంటే తక్కువ తీవ్రత గల భూకంపాలు పెద్ద ప్రమాదం కలిగించవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ ఇటువంటి కంపనాలు తరచుగా సంభవిస్తే భవిష్యత్తులో మరింత జాగ్రత్త అవసరమని వారు హెచ్చరిస్తున్నారు.

ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అనేక మంది భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ప్రస్తుతం స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఆందోళన లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. శాస్త్రవేత్తలు భూకంపాలపై మరిన్ని పరిశోధనలు జరిపి, అవసరమైన హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.