హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో ఇందిరమ్మ పాలన రావాలని మహిళలు కోరుకున్నారని.. వారి కోరిక తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో చంద్ర గ్రహణం తొలగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేబినెట్ మీటింగ్లో నిర్ణయించాం. ఆడ బిడ్డలు తలచుకుంటే వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టం కాదన్నారు.

కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలన మధ్య ఉన్న తేడా
జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించాం. 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. పాఠశాలల నిర్వహణ, బడి పిల్లలకు కోటి 30లక్షల జతల యూనిఫామ్ కుట్టించే పని మహిళలకే అప్పగించాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చాం. ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు అవుతున్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సీతక్క, కొండా సురేఖ పనిచేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సోనియాగాంధీ కృషి చేశారు. ఇందిరను అమ్మా అన్నారు.. ఎన్టీఆర్ను అన్నా అన్నారు.. నన్ను రేవంతన్న అంటున్నారు. మీతో పేగుబంధం కలిగిన మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తా అని సీఎం అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలన మధ్య ఉన్న తేడాను మహిళలు గమనిస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు మహిళలను అన్ని రంగాల్లో విస్మరించిందని.. కేసీఆర్ మొదటి టర్మ్లో ఆయన కేబినెట్లో ఒక్క మహిళా కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శమని సీఎం విమర్శించారు.