వక్ఫ్ సవరణ బిల్లు, రాష్ట్రపతికి బిల్లుల గడువు అంశాలపై సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో బీజేపీ నేతల నుండి తీవ్ర వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ లోక్సభ సభ్యుడు నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “చట్టాలు సుప్రీంకోర్టే చేస్తే, పార్లమెంటు భవనాన్ని మూసేయాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. పార్లమెంటు శాసనాధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. జడ్జీల నియామకం విషయంలో రాష్ట్రపతికే అధికారం ఉన్నా, సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రియాక్షన్
ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయాలను ప్రతిబింబించవని స్పష్టం చేశారు. “ఎంపీలు నిశికాంత్ దుబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. బీజేపీ న్యాయవ్యవస్థను గౌరవిస్తుంది. రాజ్యాంగాన్ని రక్షించడంలో మా పార్టీ బలమైన స్థానం కలిగి ఉంది” అని ఎక్స్లో జేపీ నడ్డా పోస్ట్ చేశారు. బీజేపీ నాయకులకు, ఇతర సభ్యులకు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా ఆయన సూచించారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై సవాల్
వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం మరవకముందే, నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. అయితే ఈ తీర్పులను విపక్షాలు మద్దతు తెలుపుతుండగా, బీజేపీ మాత్రం పార్టీ శ్రేణులు స్పందించే తీరుపై జాగ్రత్తలు తీసుకుంటోంది.