అమరావతి: టాలీవుడ్ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. నరసరావుపేట పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి పై కేసు నమోదైంది. దాంతో నరసరావుపేట టూ టౌన్ పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు. తాజా కేసులో భాగంగా పీటీ వారెంట్ పై పోసానిని నరసరావుపేటకు తరలించే యత్నాలు మొదలయ్యాయి. నరసరావుపేట సిఐ హైమారావు, సిబ్బంది రాజంపేట సబ్ జైలుకు చేరుకుని అధికారులతో మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నరసరావుపేట పీఎస్లో మరో కేసు నమోదు
ప్రస్తుతం పోసాని రాజంపేటలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై నరసరావు పేట పోలీసులు 153-ఎ, 504, 67 ఐటీ కింద తాజాగా కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసరావుపేటకు పోసానిని తరలించి, అక్కడ న్యాయస్థానం ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు కాగా ఆ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు ఆయనపై పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ఇప్పటివరకూ మూడు జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట సబ్ జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు.
ఒకేసారి మూడు జిల్లాల పోలీసుల నుంచి పీటీ వారెంట్లు
అనంతపురం రూరల్, గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా పోలీసులు పోసానికి సంబంధించి పీటీ వారెంట్లు రాజంపేట జైలుకు సమర్పించారు. పోసానిని తమ అదుపులోకి తీసుకునేందుకు నరసరావు పేట పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నామని చెబుతున్నారు. కనుక పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు విషయం తెలిపారు. ఒకేసారి మూడు జిల్లాల పోలీసుల నుంచి పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై సందిగ్దత నెలకొంది.