బోయింగ్ 777 విమానం ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తుంది. నాలుగు గంటల తర్వాత అజర్బైజన్ ప్రాంతంలో గగనతలంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్లకు తెలపడంతో వారు ముంబయి వైపు విమానాన్ని మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి, తనిఖీలు చేపట్టింది. అది నకిలీ కాల్ అని తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి 322 మంది ప్రయాణికులున్నారు. తనిఖీల అనంతరం మంగళవారం తెల్లవారుజామున తిరిగి న్యూయార్క్ బయల్దేరనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

తాజాగా ఘటనతో ఆందోళన
గత డిసెంబర్ లో అజర్ బైజన్ ఎయిర్లైన్స్ కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్లో ని అక్టోలో అది కూలిపోయింది. రష్యా క్షిపణి తాకడం వల్ల విమానం కూలిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది.
తరచూ గా ఎయిరిండియా వార్తల్లో
ఇక ఇటీవల ఎయిరిండియా తరచూ వార్తల్లో నిలుస్తోంది. విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి వీల్బైర్ సదుపాయం కల్పించకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిన ఆమె కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తాము బుక్ చేసుకున్నప్పటికీ.. ఎయిరిండియా సిబ్బంది ఛైర్ ఇవ్వలేదని ఆమె బంధువులు ఆరోపించారు. ఇక షికాగో నుంచి దిల్లీకి బయల్దేరిన విమానంలో టాయిలెట్లు మూసుకుపోవడంతో.. 10 గంటలు ప్రయాణం అనంతరం విమానం వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే