తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) ఇటీవల వరుసగా జరుగుతున్న వివాదాస్పద ఘటనలు అనుకోకుండా జరిగిందని అనలేమని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) పేర్కొన్నారు. తిరుమల పరిపాలనపై ప్రజల్లో అనిశ్చితి సృష్టించేలా, దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేలా ఓ ఉద్దేశపూర్వక కుట్ర జరుగుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta)కు లేఖ రాసి, తిరుమల ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు
భాను ప్రకాష్ రెడ్డి లేఖలో పేర్కొన్న అంశాల ప్రకారం, టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో ఆవులు చనిపోయాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వీడియోలు విడుదల చేశారు. తిరుమలలో అన్ని మతాలకు చెందిన వ్యక్తి ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలను ఉద్దేశపూర్వకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని అన్నారు. అంతేగాక, టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన భక్తుడి వీడియో వైరల్ కావడం వెనుక కూడా కుట్ర కోణం ఉందని భాను ప్రకాష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకుల కుట్ర
ఇంకా ఇటీవల లడ్డూ నాణ్యతపై తప్పుడు ప్రచారం, కొండపై మద్యం కనిపించిందన్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకుల ప్రేరణతో జరుగుతున్న కుట్రలో భాగమేనని అన్నారు. తిరుమలలో భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ సంఘటనల వెనుక అసలు హేతువును వెలికి తీయాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాసినట్టు తెలిపారు. టీటీడీ పరిపాలనలో చిచ్చు పెట్టే ప్రయత్నాలను బీజేపీ తిప్పికొడుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Vizag Anti Drug Park: వైజాగ్ లో “యాంటీ డ్రగ్ పార్క్”