బెట్టింగ్ యాప్ల రచ్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను తాకింది. గత కొద్దిరోజులుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీస్ చర్యలు చేపట్టింది. ఈ తరుణంలోనే యూట్యూబర్ల నుండి ఆర్టిస్టులకు వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటో చేస్తున్నవారిపై కేసులు కూడా నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, విజయ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా ఇతరుల కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఆరుగురు సినీ ప్రముఖులు, 19 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఈ కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 318 (4), 112 r/w 49, తెలంగాణ గేమింగ్ చట్టంలోని 3, 3 (A) అండ్ 4 అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2008లోని 66D కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) బుక్ చేసారు.

మియాపూర్ నివాసి ఫణింద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు
మియాపూర్ నివాసి ఫణింద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్ ఇంకా ఇతర ప్లాట్ఫామ్స్ ని చాల మంది ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ప్రోత్సహిస్తున్నారని అతను పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ల ప్రచారం సమాజాన్ని ఇంకా యువతకు హాని కలిగిస్తున్నాయని, వీటి బారిన పడి తీవ్ర ఆర్ధిక ఒత్తిడికి గురవుతున్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టాన్ని ఉల్లంఘించి జూదం ఆడటాన్ని ప్రోత్సహించే మొబైల్ యాప్లు, వెబ్సైట్ల గురించి ఆందోళన వ్యక్తం చేసిన వినయ్ వంగల (40) అనే ప్రైవేట్ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు ఈ సోమవారం 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు బుక్ చేశారు.