తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ, మకరు విళక్కు మహోత్సవం ఘనంగా ముగిసింది. ఈ మేరకు సోమవారం రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈక్రమంలోనే పదంబలం రాజ కుటుంబ ప్రతినిధి కేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న అనంతరం అంటే సోమవారం రోజు ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేసినట్లు పేర్కొన్నారు. ఈ సీజన్లో మొత్తం 53 లక్షలకు పైగా భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.

రెండు నెలల పాటు జరిగిన మండల, మకరువిళక్కు వార్షిక పూజల కోసం నవంబర్ 15వ తేదీన ఆలయాన్ని తెరిచారు అధికారులు. మండల పూజలు అయిపోయిన తర్వాత అంటే డిసెంబర్ 26వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. ఇలా 41 రోజుల పాటు సాగిన పూజా కార్యక్రమాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. నాలుగు రోజులు అయిన తర్వాత అంటే డిసెంబర్ 30వ తేదీ రోజు సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరిచారు. ముఖ్యంగా తంత్రి కందరారు రాజీవరు, ప్రధాన పూజారి (మేల్ సంతి) ఎస్ అరుణ్ కుమార్ నంబూద్రిలు సన్నిధారం ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ మకరు విళక్కు సీజన్ పూర్తయ్యే వరకూ.. ప్రతిరోజు తెల్లవారుజాము 3.30 గంటలకు ఆలయం తెరవగా 11 గంటల వరకు ప్రతిరోజూ స్వామి వారికి నెయ్యిభిషేకం చేశారు. మధ్యాహ్నం కలభ అభిషేకం అంటే పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పంచదార, చందనం, విభూతి సహా ఎనిమిది వస్తువులతో స్వామికి అభిషేకం నిర్వహించారు. ఇలా ప్రతిరోజూ పూజలు అందుకున్న మణికంఠుడికి జనవరి 11వ తేదీన ఎరుమేలిలో పేట తుళ్లై, జనవరి 14వ తేదీన మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఈ మకర జ్యోతిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు.