ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.మొత్తం 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది.స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ధ్రువపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు.
రోస్టర్ పాయింట్ల
గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.

2023 డిసెంబర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. అయితే అందులో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అయినా వాటిని ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. దీనిపై పోరాటం ఉద్ధృతం చేసిన అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే కోర్టుల్లో ఈ కేసులు వీగిపోవడంతో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే దీన్ని వాయిదా వేయాలని కోర్టులో మరో కేసు ఇంకా పెండింగ్లో ఉండగానే పరీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.మెయిన్స్ పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి అభ్యర్థులు ఆందోళన మరింత తీవ్రం చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఈ ఆందోళన ఉద్ధృతమైంది. పరీక్షకు ఒక్క రోజు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల విన్నపాన్ని మన్నించి పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి సూచనలు చేసింది.పరీక్ష వాయిదాకు ప్రభుత్వం ఓకే చెప్పినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం పట్టు వీడలేదు.అప్పటికే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున ప్రభుత్వ ఆదేశాలను పాటించలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో అనుకున్నట్టుగానే పరీక్షను నిర్వహించింది. తాజాగా ఏపీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది.