ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పట్టుబడుతుండటంపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “దేవుడే తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంపై నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
స్పీకర్ మాట్లాడుతూ
సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దామని భావించానని, అయితే వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. సభాపతి నిర్ణయాన్ని తప్పుబట్టడం, స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాలను ఉల్లంఘించడమేనని ఆయన హెచ్చరించారు.సభా వ్యవహారాల్లో స్వతంత్రంగా, నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని స్పీకర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా విషయంలో స్పష్టమైన నియమాలు ఉన్నాయని, అవి ఏ విధంగానూ వైసీపీకి అనుకూలంగా మారలేవని స్పష్టం చేశారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని సూచించారు.

ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతూనే ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రావొద్దని నిర్ణయించిన వైసీపీ అధినేత యూటర్న్ తీసుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు వచ్చారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా వైసీపీ పార్టీ నేతలు గందరగోళం సృష్టించినప్పటికీ నవ్వుతూ కూర్చున్నారే తప్ప వారిని నిలువరించలేదు. ఆ తరువాత కొద్ది నిమిషాలకే బాయ్కాట్ చేస్తూ జగన్, ఆ పార్టీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. జగన్ తీరుపై అధికారపక్షం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ ఏమన్నారంటే
జగన్ 24-06-2024న నాకు ఓ లేఖ రాశారు. దానిలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు ఉన్నాయి. ఈ లేఖలో ప్రతిపక్ష హోదా కావాలన్నారు. ఈ లేఖ రాసిన కొద్దిరోజులకు జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉంది. దీనిలో స్పీకర్ను, శాసనసభ వ్యవహరాల మంత్రిని పార్టీలను చేరుస్తూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాం. అయితే గౌరవ హైకోర్టు స్పీకర్ను ఆదేశించినట్టు ప్రచారం చేస్తున్నారు. జగన్ ఇలాంటి ప్రచారం చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దానిలో ఆయన కల్పిత విషయాలను ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్ధానాన్ని చూపుతూ చేస్తున్న అవాకులు, చవాకులపై రూలింగ్ ఇస్తున్నాను’’ అని అన్నారు.‘‘ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శాసనసభ్యుడిగా క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రిగా మంత్రుల తరువాత ఆహ్వనించారు. 11-1-1995న జరిగిన ప్రమాణంలో మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తరువాతే ప్రమాణం చేయించారు. ఏపీ 16వ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం 21-06-2024న జరిగింది. స్పీకర్ ఎన్నిక మరునాడు జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా నిరాకరించామన్న వాదన సరికాదు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైనట్టు 26-06-2024 వరకూ మా సచివాలయానికి తెలపలేదు. అలాంటప్పుడు జూన్ 26 కన్నా ముందు అందునా స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్షనాయకుడు హోదాపై నిర్ణయం తీసుకోవడం సాధ్యామా. ప్రతిపక్ష నాయకుడిగా ఎవ్వరైనా అర్హుడా లేదా అనేది రాజ్యాంగం, కోర్టు తీర్పులు మాత్రమే నిర్ధారించగలవు’’ అంటూ స్పీకర్ సభలో పేర్కొన్నారు.