వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి తాజాగా మరో కీలక నేత షాక్ ఇచ్చారు. శాసన మండలిలో డిప్యూటీ చైర్ పర్సన్గా ఉన్న ఎమ్మెల్సీ జాకియా ఖానమ్ (Zakia Khanum) పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాత్రి తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి మెయిల్ ద్వారా పంపిన ఆమె, బుధవారం ఉదయం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలం నెలకొంది.
బీజేపీలో చేరే ఛాన్స్
జాకియా ఖానమ్ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి సత్యకుమార్లను కలిసి చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో ఆమె అధికారికంగా బీజేపీలో చేరే ప్రక్రియ బుధవారం నాటికి పూర్తి కానుంది. ఒకవేళ ఆమె బీజేపీలో చేరితే, శాసన మండలిలో వైసీపీకి మరో వికెట్ కోల్పోయినట్లే అవుతుంది. ఆమె రాజీనామా నిర్ణయం పార్టీ అంతర్గత అసంతృప్తిని బయటపెడుతోంది.
వైసీపీ కి మరో దెబ్బ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో, ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల మోరల్ పూర్తిగా దెబ్బతింది. జగన్ తీరు, నాయకత్వ శైలి పట్ల అసంతృప్తితో ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. 2020 జులైలో గవర్నర్ నామినేషన్ ద్వారా ఎమ్మెల్సీగా నియమితులైన జాకియా ఖానమ్ తాజా రాజీనామా కూడా అదే వరుసలో కొనసాగుతోంది.
Read Also : TPCC : వారం రోజుల్లో టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు?