తిరుమల (Tirumala)– భక్తుల కోరికలకు తగినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో కీలక చర్య చేపట్టింది. ముఖ్యంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం ప్రసాదంగా లభించే శ్రీవారి ప్రసిద్ధి లడ్డూలను ఇప్పుడు క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండానే పొందేలా టిటిడి సరికొత్త డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

డిజిటల్ కియోస్క్ల ఏర్పాటు: సాంకేతిక పరిజ్ఞానానికి మరో అడుగు
ఇకపై భక్తులు శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేయగల కొత్త కియోస్క్లను టిటిడి ఏర్పాటు చేసింది.
ప్రయోగాత్మకంగా అమలు – భవిష్యత్లో పూర్తిస్థాయిలో అమలు
ఈ విధానాన్ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ఆదివారం ప్రారంభించింది టిటిడి. ఇందుకోసం భక్తులు తమ దర్శన టికెట్ నంబర్ను నమోదు చేసి, మీకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. ఆ రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే లడ్డూలను అందిస్తారు. ఈ విధానాన్ని కొద్ది రోజులు పరిశీలించనున్నారు. ఏవైనా లోటు పాట్లు ఉంటే దాన్ని బట్టి సవరణలు చేస్తారు.
ఆధార్ ఆధారంగా లడ్డూ పొందే అవకాశం
దర్శన టికెట్ లేని భక్తుల కోసం కూడా డిజిటల్ సదుపాయం కల్పించారు. భక్తులు కావాలంటే 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. అయితే, లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుందని గమనించగలరు. దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్లు లడ్డూ కౌంటర్ సమీపంలో ఉన్నాయి. MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్లో కూడా కియోస్క్లు అందుబాటులో ఉంటాయి.
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది
అత్యంత శ్రద్ధాభక్తులతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయిన నేపథ్యంలో, శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలో వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చింది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు, టికెట్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.
Read also: Nara Lokesh: బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేశ్