తాజాగా వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా, ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపింది. ఈ సమావేశం గురించి స్పందించిన షర్మిల, జగన్ అసలు స్వభావం గురించి తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం, విజయసాయిరెడ్డి తనతో జగన్ వల్ల తాను అనుభవించిన కష్టాలను పంచుకున్నారు. తన కుటుంబంలోని ఆస్తుల విషయంలో కూడా జగన్ అక్రమంగా వ్యవహరించారని షర్మిల ఆరోపించారు. తనకు, తన తల్లికి రావాల్సిన వాటాను కాజేయాలని షేర్లు తనకే చెందాలని కేసులు పెట్టారని ఆమె పేర్కొన్నారు.

అంతేకాక, తాను చెప్పిన నిజాలను అబద్ధాలుగా మార్చేందుకు జగన్ విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారని షర్మిల ఆరోపించారు. విజయసాయిరెడ్డి అంగీకరించకపోతే, సుబ్బారెడ్డిని ఉపయోగించి మరింత ఒత్తిడి తీసుకొచ్చారని షర్మిల వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరికను వ్యతిరేకంగా నిలిచి, సత్యాన్ని కప్పిపుచ్చాలని జగన్ ప్లాన్ చేశారని ఆమె విమర్శించారు.
జగన్ తనకు తోడబుట్టిన చెల్లిని కూడా చూడకుండా పూర్తిగా దిగజారిపోయారని షర్మిల ధ్వజమెత్తారు. జగన్ ఇటీవల “క్యారెక్టర్” గురించి మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, తన స్వంత క్యారెక్టర్ గురించి జగన్ ఆలోచించుకోవాలని షర్మిల సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అబద్ధాలు ఎలా చెప్పాలనే విషయాన్ని 40 నిమిషాల పాటు డిక్టేట్ చేయడం తనను ఆశ్చర్యపరిచిందని ఆమె వ్యాఖ్యానించారు.
జగన్, ఆయన భార్య తన తల్లిపైనా కేసు పెట్టడం దారుణమని షర్మిల ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జన్మించిన జగన్ ఇంతగా మారిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. చివరగా, జగన్ తన నిజ స్వరూపాన్ని బైబిల్ ముందు పెట్టుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలని షర్మిల సూచించారు.