వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై చర్యల విషయంలో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి తన పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ కేసులో ఆరో నిందితుడిగా (A6) ఉన్న గజ్జల ఉదయ్ కుమార్రెడ్డిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) జనరల్ మేనేజర్కు ఆమె ఘాటుగా లేఖ రాశారు. సుమారు 500 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తిపై సంస్థ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, పైగా బెయిల్పై వచ్చిన నిందితుడిని తిరిగి విధుల్లోకి ఎలా అనుమతిస్తారని ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఈ విషయంలో స్థానిక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, గత 11 నెలలుగా సస్పెన్షన్ ప్రక్రియలో జరిగిన జాప్యంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
IFR Milan 2026 : విశాఖలో అంతర్జాతీయ పరేడ్ వైభవం, ప్రపంచం చూపు ఇక్కడే!
కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేస్తూ ఇంతటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పట్ల యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరించడాన్ని సునీత తప్పుబట్టారు. ఉదయ్ కుమార్రెడ్డి జైలులో ఉన్న కాలానికి సంబంధించి ఆయనకు చేసిన చెల్లింపులపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని, అలాగే సీబీఐ అధికారులపై ఆయన చేసిన తప్పుడు ఫిర్యాదులపైనా దర్యాప్తు చేయాలని ఆమె కోరారు. 15 రోజుల్లోగా తీసుకున్న చర్యల వివరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని, లేనిపక్షంలో విజిలెన్స్ మరియు న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోనని ఆమె హెచ్చరించారు. ఈ వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తానని ఆమె మీడియా వేదికగా స్పష్టం చేశారు.