నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు
Rayalaseema irrigation : సచివాలయం దార్శనిక నేతలు స్వర్గీయ నందమూరి తారకరామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే రాయలసీమకు జీవనాడిలా ఉన్న ప్రతి సాగునీటి వనరుకూ పునాది పడిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కరువు సీమగా పేరొందిన రాయలసీమను సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలంగా మార్చిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబుదేనన్నారు.
1983లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్టీఆర్ రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే సాధ్యమని గుర్తించి, తెలుగు గంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలుగోడు బ్యాలెన్సర్, గోరకల్లు, అవుకు, గండికోట వంటి కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆ దార్శనిక ఆలోచనలనే కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులను విస్తరించి, రాయలసీమ సాగునీటి కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు కృషి చేశారని మంత్రి తెలిపారు.
నేడు రాయలసీమలో ఏ ప్రాజెక్టు లేదా రిజర్వాయర్ (Rayalaseema irrigation) పేరు వినిపించినా ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడేనని అన్నారు. రాయలసీమకు జీవనాడిలా మారిన ప్రతి నీటి వనరుకీ వీరిద్దరి దూరదృష్టి, పట్టుదల, పరిపాలనా దక్షతే పునాదిగా నిలిచిందన్నారు.
Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించడంతో రాయలసీమలోని జలాశయాలు, చెరువులు జలకళతో నిండిపోయాయని మంత్రి వివరించారు. హంద్రీ–నీవా ప్రాజెక్ట్ రాయలసీమకు జీవనాడిగా మారిందని, 2019 నాటికే పంపులు సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటిని వినియోగించకపోవడం ద్వారా రైతులకు అన్యాయం జరిగిందన్నారు.
గత ఐదేళ్లలో హంద్రీ–నీవాకు కేవలం రూ.514 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో రూ.3880 కోట్లు వెచ్చించిందన్నారు. అలాగే కృష్ణమ్మ నీరు కుప్పం బ్రాంచ్ కెనాల్ చివరి మైలు వరకు, మడకసిర బ్రాంచ్ కెనాల్ వరకు చేరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గోరకల్లు, అవుకు వంటి ప్రాజెక్టులు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయని, అయితే కూటమి ప్రభుత్వం వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టిందన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినప్పుడు ఐదు రోజుల్లో కొత్త గేట్ ఏర్పాటు చేయడం, శ్రీశైలం ప్లంజ్పూల్ మరమ్మతులకు రూ.203 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చురుకుదనానికి నిదర్శనమన్నారు.
రాయలసీమలో రైతులు రెండో పంట కూడా సాగు చేసే స్థాయికి నీటిసౌకర్యాలు మెరుగుపడ్డాయని, ఇది రైతుల జీవితాల్లో నీటి రూపంలో వచ్చిన చారిత్రాత్మక మార్పుగా మంత్రి అభివర్ణించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి ప్రజలు మోసపోరని స్పష్టం చేశారు. గోదావరి వరద జలాల వినియోగానికి పోలవరం–బొల్లాపల్లి–కృష్ణ లింక్ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: