ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ తీవ్రత పెరిగింది. తాజా ఎన్నికల అనంతరం టీడీపీ ఆధిక్యంలోకి వచ్చిన నేపథ్యంలో, పార్టీ వర్గాల్లో ఎమ్మెల్సీ సీట్లు ఎవరికీ కేటాయిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చుట్టూ ఆశావహులు మోహరించారు. తమకు ఒక్కసారి అవకాశం కల్పించాలని నేతలు, సీనియర్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
సీనియర్ నేతలు పోటీ
ఈ సీట్ల కోసం SVSN వర్మ, దేవినేని ఉమ, వంగవీటి రాధా, బీదా రవిచంద్ర, కందుల శ్రీధర్, బుద్ధా వెంకన్న, KS జవహర్, మోపిదేవి వెంకటరమణ, KE ప్రభాకర్, పీతల సుజాత, ఇద్దం ప్రతాప్ రెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, మల్లెల లింగారెడ్డి, నాగుల్ మీరా, రుద్రరాజు పద్మరాజు తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో అందరికీ పార్టీకి చేసిన సేవలు, రాజకీయ అనుభవం, ప్రాంతీయ సమీకరణలు వంటి అంశాల ఆధారంగా సీఎం నిర్ణయం తీసుకోనున్నారు.

ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్ నేతలు, మాజీ మంత్రులు
ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్ నేతలు, మాజీ మంత్రులు మాత్రమే కాకుండా యువ నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొన్ని చోట్ల కుటుంబ రాజకీయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటలో అనుభవసంపన్న నేతలకే ఎక్కువ అవకాశం ఉంటుందని, వీరిలో కొందరు మంత్రివర్గంలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు, లోకేశ్ వద్ద లాబీయింగ్
ఇక, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా తమకు నచ్చిన నేతలకు మద్దతుగా చంద్రబాబు, లోకేశ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. త్వరలోనే పార్టీ అధిష్ఠానం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా లిస్టును విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సీట్ల కేటాయింపు పార్టీలో ఉన్నంతగా, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.