ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మహీంద్రా సంస్థ విడుదల చేసిన తాజా యాడ్పై స్పందించారు. ఫ్యూరియో-8 ట్రక్కులకు సంబంధించిన ఆ ప్రకటన తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ఆ యాడ్ ఆవిష్కరించిన వినూత్నత, స్థానికతను ప్రోత్సహించే శైలి ప్రజల మనసులు గెలుచుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఏపీలో కర్మాగారం ఏర్పాటు చేయాలని ఆహ్వానం
ఈ సందర్భంగా లోకేశ్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ (Mahindra Group Chairman Anand) మహీంద్రా తెలుగులో చేసిన ట్వీట్ను పంచుకుంటూ, రాష్ట్రంలో ఉత్పాదన కర్మాగారం ఏర్పాటు చేయాలని సంస్థను ఆహ్వానించారు. ప్రత్యేకంగా, రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన ఆటోమోటివ్ ఇకోసిస్టమ్, విస్తరించిన వినియోగదారుల మార్కెట్ను ఉపయోగించుకోవాలని సూచించారు. “మీ తెలుగు యాడ్ చాలా బాగుంది సర్. ఆంధ్రప్రదేశ్ మీ వాహనాలకు పెద్ద మార్కెట్. మా రాష్ట్రంలోని అపార అవకాశాలను పరిచయం చేయడానికి మీ బృందాన్ని ఆహ్వానిస్తున్నాం” అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం: లోకేశ్
నారా లోకేశ్ రాష్ట్రంలోని అధునాతన మౌలిక సదుపాయాలు, ప్రవేశయోగ్యమైన మార్కెట్, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి అంశాలను హైలైట్ చేశారు. ఆటోమొబైల్ రంగంలో ఏపీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందని తెలిపారు. మహీంద్రా వంటి దిగ్గజ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పారిశ్రామిక రంగం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మహీంద్రా సంస్థ ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
Read Also : Heavy Rain Alert in AP : మరో 3 రోజులపాటు వర్షాలు